Home తాజా వార్తలు గురుకులాలు, హాస్టళ్లలో ప్రభుత్వ మెనూను అమలు చేయాలి: మంత్రి పొన్నం

గురుకులాలు, హాస్టళ్లలో ప్రభుత్వ మెనూను అమలు చేయాలి: మంత్రి పొన్నం

VGన్యూస్: గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్తైన నేపథ్యంలో గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురుకులాలు, హాస్టళ్లు పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణంలో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అన్ని గురుకులాలు, హాస్టళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లా బీసీ సంక్షేమ అధికారులు (డీబీసీవోలు) క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు తరచూ గురుకులాలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, గురుకులాల కార్యదర్శి ఆకస్మికంగా గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. స్టడీ సర్కిల్స్‌లో మరింత నాణ్యత పెంపొందించేందుకు, సివిల్స్‌తో పాటు వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న స్టడీ సర్కిల్స్ విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.
జూలై 16 నుంచి కులవృత్తుల మేళా:
జూలై 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న కులవృత్తుల మేళాలో అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులకు సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే కుట్టు మిషన్ పథకం అమలు కోసం సమగ్ర విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి ఉపాధి అవకాశాలను పెంచాలన్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై సమగ్ర అధ్యయనం చేసి అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే కాటమయ్య రక్షణ కవచాల శిక్షణ పూర్తి చేసుకొని కిట్లు అందని జిల్లాల్లో వెంటనే పంపిణీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయదేవి, గురుకులాల కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.