VGన్యూస్: తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొనసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు.
పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని అన్నారు. పెద్దిని కోల్పోయి శోక తప్త హృదయులై ఉన్న భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు, కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హరీష్ రావు, పార్టీ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల తమ సంతాపాని ప్రకటించారు.







