VGన్యూస్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్లో భాగంగా తమకు కేటాయించిన మేరకు 15 టీఎంసీల నీరు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు. కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (తెలంగాణ), చంద్రబాబు నాయుడు (ఏపీ), డీకే శివకుమార్ (కర్ణాటక) లతో పాటు మూడు రాష్ట్రాల నుండి పలువురు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీఎస్ కింద పాలమూరుకు కేటాయించిన 15.9 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించగలుగుతున్నాం. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యల కారణంగా కేటాయించిన నీటిలో మరో 10 టీఎంసీల నీరు అందక, గద్వాల్, అలంపూర్ ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు నష్టం జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతుల కోసం మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాం నవాబు కలిసి తుంగభద్ర డ్యామ్ను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం గొప్ప పని చేశారు. ఆ స్ఫూర్తితోనే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా రైతన్నల కోసం అడుగులు ముందుకు వేశాం. 3 రాష్ట్రాల ప్రతినిధులం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే పట్టుదలతో ఇక్కడికి రావడం జరిగింది. కేంద్రమంత్రి పాటిల్ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నీటి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల పొలాలను తడపాల్సిన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది అని వివరించారు. సమస్య ఇప్పటిది కాదు. మూడు తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతున్నది. బళ్లారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లాల లక్షలాది మంది రైతుల సమస్యలకు ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతున్నదని పేర్కొన్నారు










