VGన్యూస్: రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను ఇకపై పేపర్ లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశాలను తెలంగాణ డిజిటల్ కేబినేట్గా నిర్వహించడానికి వీలుగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరికీ ప్రత్యేకంగా ట్యాబ్లను అందజేశారు. మంత్రిమండలి సమావేశాల నిర్వహణకు సంబంధించిన డిజిటల్ విధానాన్ని ట్యాబ్ల ద్వారా సమావేశంలో ప్రదర్శించి పరిశీలించారు. ఇక నుంచి ఈ-బుక్ ద్వారానే మంత్రిమండలి సమావేశం ఎజెండా, సంబంధిత నోట్స్ అన్నీ కూడా మంత్రులకు అందుబాటులో ఉంచనున్నారు.







