VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, వరదల వంటి దుస్థితి హైదరాబాద్ నగరానికి రాకూడదన్న సంకల్పంతో పని చేస్తున్నామని చెప్పారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్లో సీఎం మొక్కను నాటి వనమహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎకో పార్క్ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
వనమహోత్సవంలో భాగంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటడం, వనాల పెంపుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణకు సంబంధించి రూ.35.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో రూ. 17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ. 17.66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల వంటి అభివృద్ధి పనులను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి. మీ మేరకు అంతర్జాతీయ స్థాయిలో రివర్ఫ్రంట్ పూర్తి చేసే బాధ్యత నాది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం. సబర్మతీ, గంగా, యమునా నదుల రివర్ఫ్రంట్ల కన్నా అద్భుతంగా మూసీ రివర్ఫ్రంట్ను అభివృద్ధి చేస్తాం” అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏ పనులు చేయాలన్నా ఒక ప్రాంతం వైపు మాత్రమే చేపట్టారని, కూతవేటు దూరంలో ఉన్న ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, గుర్రంగూడ, బైరామల్ గూడ, సాహెబ్ నగర్ లాంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని పలు అంశాలను వివరించారు. ఈ విషయాలపై ఆలోచన చేసి జిల్లాలో ఈ ప్రాంతాలవైపు అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పనులు చేపట్టామని చెప్పారు. అందులో భాగంగానే రూ. 2,400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. గుర్రంగూడ స్థలాన్ని కూడా కబ్జా చేయాలని, కొందరు ప్రైవేటు వ్యక్తులు స్థలాన్ని లేఅవుట్ చేసి విక్రయించాలని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టులో బలంగా వాదించి రక్షించుకున్నామని తెలిపారు. ఇందులో నేషనల్ పార్క్ కోసం వంద ఎకరాలను కేటాయించామని చెప్పారు. ఎల్బీ నగర్ ప్రాంతంలో 424 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పార్క్ను నిర్మించడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించానని అన్నారు.
కబ్జాలు, ఆక్రమణల కారణంగా వర్షపు నీరు వెళ్లడానికి వీలులేక వర్షాలొచ్చినప్పుడు బస్తీలకు బస్తీలు నీట మునిగాయని గుర్తుచేస్తూ, అలాంటి కష్టాలు రావొద్దన్న ఉద్దేశంతోనే కబ్జాల కోరలు పీకాలని హైడ్రాను తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చెరువులు, పార్కులు, నాలాలు కబ్జా చేస్తే హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. కొద్ది మంది కబ్జాలకు పాల్పడటం వల్ల వేలాది కుటుంబాలు కష్టాలను ఎదుర్కొనే పరిస్థితిని ఉపేక్షించబోమని అన్నారు. గతంలో సీరీస్ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, మాజీ ఎంపీ మధుయాష్కి తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.







