Home జాతీయం & అంతర్జాతీయం హైదరాబాద్ లో నేపాల్ మేయర్లు, ఛైర్‌పర్సన్ల పర్యటన

హైదరాబాద్ లో నేపాల్ మేయర్లు, ఛైర్‌పర్సన్ల పర్యటన

VGన్యూస్: నేపాల్‌కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ సంస్కరణలు తదితర అంశాలపై అధ్యయన పర్యటన చేపట్టారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఆధ్వర్యంలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ బృందం ఆగస్టు 3 నుండి 4, 2026 వరకు హైదరాబాద్‌లోని NIUM సారధ్యంలో శిక్షణ పొందనుంది.
శిక్షణలో భాగంగా సోమవారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) లో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ పరిపాలన, మున్సిపల్ సంస్కరణలు, సుస్థిర పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా విధానాలు మరియు ఉత్తమ ఆచరణలను అధికారులు బృందానికి వివరించారు. ఆగస్టు 4న ఈ ప్రతినిధి బృందం జవహర్‌నగర్ సమీకృత మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం (HIMSWF), అంబర్‌పేట్ మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) మరియు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (FSTP)లను సందర్శించి, తెలంగాణలో అమలవుతున్న ఆధునిక వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత్–నేపాల్ మధ్య పట్టణ పరిపాలన, స్థానిక సంస్థల సామర్థ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి మరియు ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని (NIUM) నిర్వాహకులు తెలిపారు.