VGన్యూస్: సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ టీజీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాదులోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (TGMSIDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) ల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, సర్జికల్స్, రీజెంట్స్, ఎక్విప్మెంట్స్ టెండర్లను పారదర్శకంగా ఉండేలా విధివిధానాలను రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 2 కమిటీలకు అదనంగా మరో 3 కమిటీలను కొత్తగా నియమించాలన్నారు. సంస్థలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని సంస్థ MD గౌరవ్ ఉప్పల్ ను ఆదేశించారు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆస్పత్రులలో TGMSIDC ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, ఎక్విప్మెంట్స్, సివిల్ వర్క్స్ లను రెగ్యులర్ గా పర్యవేక్షించడానికి తక్షణమే నోడల్ ఆఫీసర్స్ ను నియమించాలన్నారు. TGMSIDC లో టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, ఎక్విప్మెంట్, సర్జికల్, రీజెంట్స్ లను నెలవారీగా, విధిగా సమీక్షించుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్ని స్థాయిల ఆసుపత్రులకు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు) అవసరమైన ఎక్విప్మెంట్ కు సంబంధించి ఒక ప్రామాణిక జాబితా (Standard Equipment List) ను తయారు చేసి, నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీని వలన అన్ని స్థాయిల ఆసుపత్రులలో ఏకరూపత ఉంటుందన్నారు. మందుల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, CURE ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 2 CMS కేంద్రాలకు అదనంగా మరో 4 కొత్త CMS కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. హిమోఫిలియా బాధితులకు నెల వారిగా అవసరమైన మందులను ఉచితంగా అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ మందులను జనరల్ ఆసుపత్రుల (GGH) ద్వారా బాధితులకు అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. హిమోఫిలియా బాధితులకు ఉపయోగించే మందులను ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్ లలో అందుబాటులో ఉన్నాయని మంత్రి కి కార్పొరేషన్ అధికారులు వివరించారు. అదనంగా ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో TGMSIDC కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, ED ఇంఛార్జి వెంకటేశ్వర్లు,కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.







