Home తాజా వార్తలు గ్రామీణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: మంత్రి సీతక్క

గ్రామీణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: మంత్రి సీతక్క

VGన్యూస్: పట్టణ ప్రాంత రోడ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి ఆన‌సూయ సీతక్క స్పష్టం చేశారు. అందుకోసమే అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్, ఈఎన్సీ జోగారెడ్డి, సీఈలతో కలిపి గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూ, ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు కనెక్టివిటీ ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని వెల్లడించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా హ్యామ్ మోడల్‌లో మొత్తంగా 6,703 గ్రామాల్లో 18,472 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. అందులో మొదటి విడత కింద 2,678 గ్రామాల్లో 7,450 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, పునర్నిర్మాణ ప‌నులు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేని 179 గ్రామాలకు తొలిసారిగా 934 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న హ్యామ్ విధానాన్ని దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నందున మార్గదర్శకాలను అత్యంత సమగ్రంగా రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. ఆర్బీఐ అనుమతుల వచ్చే వారంలోగా పూర్తి స్థాయిలో రానున్నాయని, ఆగస్టు 15 నాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్రిమెంట్లు కాగానే కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించాలని, టెండర్లు దక్కించుకోవడంలో చూపిన ఉత్సాహం పనులు పూర్తి చేయడంలోనూ చూపాలని స్పష్టం చేశారు. పనులను సొంత బాధ్యతగా స్వీకరించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
గతంలో సింగిల్ రోడ్డు ఉన్న చోట కూడా ఇప్పుడు భారీ వాహనాలు వెళ్లేలా నాణ్యతతో రోడ్లను నిర్మించాలని తెలిపారు. పనుల్లో ఆలస్యం లేకుండా భూసమీకరణ, చెట్ల తొలగింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలన్నారు. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని, అటవీ భూములు ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక అధికారుల సహాయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.