VGన్యూస్: తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సీఎంతో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి భేటీ అయ్యారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నివేదికను అందించారు.
ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్టు ప్రతినిధులు వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సరీ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రాహదారిని విస్తరించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని ఆదేశించారు.







