VGన్యూస్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై భాజపా “రైతు గోస-బీజేపీ భరోసా” అనే పేరుతో పోరుబాట పట్టింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. సోమవారం బీజేపీ ప్రతినిధుల బృందం వికారాబాద్ జిల్లా కులకచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి.. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా.. ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా.. రైతులను ఆదుకోవడానికి కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేని దారుణమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రైతుల సమస్యలపై రెండు నెలల క్రితమే బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని హెచ్చరించినా.. పెడచెవిన పెట్టారన్నారు. బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వస్తున్నారని తెలిసి.. రాత్రికి రాత్రే హడావిడిగా ట్రాక్టర్లు తెప్పించి, అరకొరగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రైతుల హక్కులు, ఆత్మగౌరవం మరియు సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని రామచందర్ రావు స్పష్టం చేశారు.







